తెలంగాణ కళాకారుడు, గుస్సాడీ నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు కన్నుమూశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఆయన 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. శనివారం మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే ఆయన ఈసారి పండగ ముందే మృత్యుఒడికి చేరడంతో ఆదివాసీ గూడేల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి 2021 లో కనకరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రదానం చేసింది.
అసిఫాబాద్లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరచూ ప్రదర్శిస్తూ భావి తరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దాంతో, ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీల కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేసింది. 2021 నవంబర్ 9వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ చేతుల మీదుగా ఆయన దేశపు నాలుగో అత్యున్నత అవార్డు అయిన పద్మశ్రీని అందుకున్నారు.









