దీపావళి సందర్భంగా ఫోన్ పే నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి క్రాకర్స్ బీమా పాలసీని అతి తక్కువ ధరకు ప్రారంభించారు. ఇది ఎప్పటివరకు ఉంటుంది, ఈ స్కీం వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళి పండుగకు ఇంకొన్ని రోజులే ఉంది. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే ప్రత్యేకమైన బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ బీమా స్కీం ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల జరిగే ప్రమాదాలకు బీమా కవరేజీ లభిస్తుంది. దీపావళి సందర్భంగా పటాకులకు సంబంధించిన సంఘటనలు జరిగినప్పుడు మీకు సహాయం చేయడానికి ఫోన్ పే ఈ బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ బీమా పాలసీ కోసం మీరు కేవలం రూ. 9 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ క్రాకర్ ధర, చాయ్ లేదా కాఫీ కంటే తక్కువగా ఉండటం విశేషం.
ఎంత వరకు చెల్లిస్తారంటే
దీనిని తీసుకోవడం ద్వారా కంపెనీ మీకు 10 రోజుల పాటు రూ. 25 వేల కవరేజీని అందిస్తుంది. ఈ ప్లాన్ కింద పాలసీదారులు పటాకుల కారణంగా ఆసుపత్రిలో చేరడం, చికిత్స చేయించుకోవడం లేదా ప్రమాదవశాత్తు మరణానికి సంబంధించిన ఖర్చుల నుంచి భద్రతను పొందవచ్చు. పటాకుల బీమా ప్లాన్ పాలసీదారుని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులను కవర్ చేస్తుంది. బాణసంచా కాల్చే సమయంలో పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 25,000 ఒకేసారి చెల్లించనున్నారు. బాణసంచా కాల్చే సమయంలో ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరినట్లయితే ఫ్లోటర్ ప్రాతిపదికన రూ. 25,000 బీమా మొత్తం ఇస్తారు.
కొనుగోలు చేసే ప్రక్రియ
ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్క్ ప్లాన్ను మీరు ఫోన్ పే యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది నేటి (అక్టోబర్ 25, 2024) నుంచి అందుబాటులోకి వచ్చింది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ పాలసీల విక్రయం నవంబర్ 3, 2024 వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్వల్పకాలిక కవరేజ్ ప్రత్యేకంగా పండుగ సీజన్ కోసం రూపొందించబడింది. ఈ బీమా పాలసీ చెల్లుబాటు దీపావళి సమయంలో 10 రోజులు మాత్రమే ఉంటుంది.
ఈ సంస్థతో ఒప్పందం
దీపావళి సందర్భంగా పటాకుల సంబంధిత ప్రమాదాలకు పరిమిత కాలానికి సరసమైన బీమా కవరేజీని అందించడానికి బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫోన్పే పేమెంట్స్ మేజర్ తెలిపారు. ఈరోజు నుంచి ఇది మొదలైందని, అనేక మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.









