ఎంఎంటీఎస్ సర్వీసుల పొడిగింపుపై కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ (MMTS) సేవలను పొడిగిస్తామని వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి దాదాపుగాలో 90 శాతం మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి అయ్యిందని వివరించారు.
అంతకుముందు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్తో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం రైల్ నిలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామన్న కేంద్రమంత్రి, వరంగల్లో రూ.650 కోట్లతో రైల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్ను పెంచామని చెప్పుకొచ్చారు.
మరోవైపు జోన్ పరిధిలో ఇఫ్పటికే 5 వందే భారత్ రైళ్లు నిత్యం ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలోనే మరికొన్నింటినీ ప్రవేశపెడతామన్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కేవలం ఘట్కేసర్ వరకే ఎంఎంటీఎస్ సర్వీసులు రోజూవారీగా నడుస్తున్నాయన్నారు. ఈ సర్వీసులను యాదాద్రి వరకు విస్తరించాల్సి అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు రూ.650 కోట్లు మేర నిధులు అవసరమవుతాయన్నారు. అయితే తెలంగాణ సర్కార్ సహకరించకున్నా కేంద్రం నిధులతోనే ఎంఎంటీఎస్ సర్వీసును పొడిగిస్తున్నట్లు స్ఫష్టం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్రావు, సురేష్రెడ్డి, కావ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు తమ ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు.









