AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దసరా వేళ మరో తీపికబురు.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి కీలక ముందడుగు..

దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపికబురు వినిపించింది. తెలంగాణలో నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో మరో కీలక ముందడుగు పడింది. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తామంటూ మంత్రులు చాలా రోజులుగా చెప్తూ వస్తుండగా.. ప్రజల్లో ఓ ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. త్వరలోనే అర్హులను కూడా ఎంపిక చేసి వారికి మంజూరు పత్రాలను ఇవ్వాలని యోచిస్తోంది. అయితే… ఈ పథకాన్ని పకడ్బంధీగా అమలు చేసేందుకు గానూ.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని భావించిన సర్కారు.. అందుకు సంబంధించిన జీవో జారీ చేసింది. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అయితే.. ఈ గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్‌ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులుండగా.. కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ ఏడుగురు సభ్యుల్లో మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఉండనుండగా.. ఎస్సీ, బీసీ సభ్యులు ఉండేలా జాగ్రత్త పడాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. ఇక మున్సిపాలిటీ స్థాయిలోని కమిటీల్లో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌, ఛైర్మన్‌ ఉంటారు. అయితే.. ఈ కమిటీలు అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి.

అయితే.. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కమిటీల్లో ఉండే సభ్యుల కోసం పేర్లు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను సర్కారు ఆదేశించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10