AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రుణమాఫీతో జన్మధన్యమైంది.. సీఎం రేవంత్‌రెడ్డి.. రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మాట తప్పని, మడప తిప్పని పార్టీ అంటేనే కాంగ్రెస్‌ అని, రుణమాఫీ చేయడంతో నా జన్మ ధన్యమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ రైతులందరి ఇళ్లల్లో పండుగ రోజని, రైతు రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని అన్నారాయన.

రూ. లక్షన్నర వరకు..
కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, రూ. లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పామని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ విధానమని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ. లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందన్నారు. వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని సీఎం తెలిపారు. దేశ భద్రత, ఆహార భద్రతకు కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని, రైతుల కష్టాలు గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

మొదటి స్థానంలో నల్లగొండ
మొదటి రెండు విడతల్లో కలిపి అత్యధిక రైతు రుణాలు ఉన్న జాబితాలో.. మొదటి స్థానంలో నల్లగొండ జిల్లా, చివరి స్థానంలో హైదరాబాద్‌ జిల్లా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూడు దశల్లో రుణమాఫీ ద్వారా 35,49,870 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మూడు దశల్లో రెండు లక్షల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో.. మొత్తం రూ.24,449,95 కోట్లు జమ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

హామీ నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల..
రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని, ఒకే పంటకాలంలో రూ.31వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఆగస్టులో రూ.2 లక్షల లోపు అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని, పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే రైతుభరోసా విధివిధానాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో కంటే భిన్నంగా రైతుభరోసా విధివిధానాలు ఉంటాయని, ఆయిల్‌పామ్‌ పంట వేయాలని రైతులను కోరుతున్నామని, ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ వేయాలని కోరుతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.

రైతు మేలు కోసమే.. డిప్యూడీ సీఎం..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతు మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, రైతు రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

ANN TOP 10