AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయిబాబాపై ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన మంత్రి ఆనం..

సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి దుష్ప్రచారం చేశాయన్నారు. వ్యక్తిగతంగా తాను సాయిబాబా భక్తుడేనని తేల్చిచెప్పారు. స్వామికి పూజించిన తర్వాత దినచర్య ప్రారంభిస్తానన్నారు.

 

సాయిబాబా భక్తులకు ఆనం క్షమాపణలు

 

సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించడాన్నిఖండించారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 

వ్యక్తిగతంగా తాను సాయిబాబాకు భక్తుడినని మనసులోని మాట బయపెట్టారు. ప్రతిరోజూ స్వామికి పూజించిన తర్వాత దినచర్య ప్రారంభిస్తానన్నారు. తన వ్యాఖ్యలు ఏ ఒక్క భక్తుడి మనోభావాలు దెబ్బ తిన్నా హృదయపూర్వకంగా మన్నించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం-దేవాదాయ శాఖ ఎవరిపైనా వివక్ష చూపలేదన్నారు.

 

వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన మంత్రి ఆనం, ఏం జరిగింది?

 

ఎవరైనా ఆరాధించే మహనీయులను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం సాయిబాబా ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 5 వేల భజన మందిరాల కార్యక్రమం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ- గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణమనే లక్ష్యంతో చేపట్టామన్నారు.

 

శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలు, విధానాల ప్రకారమే నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ లక్ష్యాలు, నిబంధనల ఆధారంగా నిధుల కేటాయింపు జరుగుతోందన్నారు. ఈ పథకం కింద సాయిబాబా ఆలయాలకు నిధులు ఇవ్వకపోవడమంటే స్వామిని లేకుంటే భక్తులను అవమానించినట్లు కాదన్నారు.

 

రాముడు, కృష్ణుడు, శివుడు, సాయిబాబా ఇలా ప్రజలు ఆరాధించే ఏ విశ్వాసాన్ని ప్రభుత్వం కించపరచదన్నారు. ట్రస్టుల నిబంధనలు, విధానాలకు సంబంధించిన అంశాలను అనవసర వివాదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను వక్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలను నమ్మవద్దని కోరారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

 

రెండురోజుల కిందట మీడియా ముందుకొచ్చిన మంత్రి ఆనం.. శ్రీవాణి నిధులను షిర్డీసాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమన్నారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమేనన్నారు. షిర్డీసాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావన్నారు. సనాతన ధర్మ ప్రచారం కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని తేల్చిచెప్పారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, ధార్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెల్సిందే.

ANN TOP 10