దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్పై తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరిగా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
రాయలసీమలో బంగారం అమ్మకం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం
విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు విదేశీయులు వచ్చేవారని చరిత్రకారులు చెబుతారు. అదంతా గతం.. ఇక వర్తమానంలోకి వచ్చేద్దాం. రాయలసీమ బంగారం అమ్మకాలకు కేరాఫ్గా మారబోతోంది. బుధవారం జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టుని ప్రారంభించినున్నారు సీఎం చంద్రబాబు.
రాయలసీమలో స్వర్ణగిరిగా అవతరిస్తోంది జొన్నగిరి ప్రాంతం. ఉమ్మడి కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్-డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు బంగారం వెలికితీత పనులు ప్రారంభించనున్నాయి. రూ. 405 కోట్ల భారీ పెట్టుబడితో ప్లాంట్ను ఏర్పాటు చేశాయి. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుని ప్రారంభించినున్నారు. కేవలం ఒక పరిశ్రమ ప్రారంభోత్సవం కాదు.. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చగల ఒక పారిశ్రామిక విప్లవం.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
భారత్ ప్రతీ ఏటా దాదాపు 700 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేస్తోంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మారక నిల్వలపై భారం పడింది. ఈ తరుణంలో జొన్నగిరి మైనింగ్ ప్రాజెక్టు దేశానికి ఎంతో కీలకమైనదిగా మారింది. తొలి ఏడాది 400 కేజీలు బంగారాన్ని వెలికి తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి సదరు కంపెనీలు.
రెండో దశలో 900 కేజీలు ఉత్పత్తి చేయనుంది. ఆ తర్వాత ఉత్పత్తిని క్రమంగా పెంచనుంది. బంగారం దిగుమతులపై ఆధారపడే భారాన్ని తగ్గించే మొదటి అడుగు. ఈ ప్రాజెక్టు వల్ల దేశానికే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక యువతకు ప్రయోజనం చేకూరనుంది. సుమారు 700 మందికి పైగా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రయల్ రన్స్ విజయవంతం అయ్యింది. వెంటనే రెండో యూనిట్ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.








