AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ పోతున్న క్రమంలో.. రైతు భరోసా ఎప్పుడని అన్నదాతలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తుమ్మల ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే.. రెండు సభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకుని.. ప్రభుత్వం తుది నిర్ణయానికొచ్చి అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే.. ఆయా నియోజకవర్గాల్లో రైతు భరోసాపై అన్నదాతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. ఇక.. సభలో చర్చించి తుది నిర్ణయానికి వచ్చి మార్గదర్శకాలు విడుదల చేసి.. అమలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు.

మరోవైపు.. రాష్ట్రంలోని అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 26 వేల కోట్లు నిధులు వృథా అయ్యాయని పేర్కొన్నారు. ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. శాసనమండలిలో వివిధ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానాలు ఇచ్చారు.

ఇక.. గోదావరి నదిలో వరద లేదని.. ప్రాణహితలో మాత్రం వరద ఎక్కువగా వస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. దాంతో.. సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం బ్యారేజీలు సక్రమంగా నిర్మించలేదని.. అందుకే వివిధ ప్రాజెక్టులలో నీరు వృథాగా పోతున్నాయని తెలిపారు. ఇష్టారీతిలో ప్రాజెక్టులకు రీడిజైన్‌లు చేసి.. అస్తవ్యస్తంగా మార్చేశారని.. అందుకే ఇప్పుడు రైతులకు కష్టాలు వస్తున్నాయన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ గొప్పగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని బ్యారేజ్‌లు సక్రమంగా నిర్మించక పోవడం వల్ల నీళ్లన్ని వృథాగా పోతున్నాయని మంత్రి విమర్శించారు.

ANN TOP 10