ప్రస్తుతం నిలకడగా ఆరోగ్య పరిస్థితి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ప్రముఖ తెలంగాణ ప్రజాకవి జయరాజుకు శనివారం ఉదయం గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ కు తరలించారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
వారం రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకల్లో జయరాజు కనిపించారు. ఇంతలోనే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. ప్రస్తుతం జయరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు..
ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మనూర్ లో జన్మించిన జయరాజ్.. వివక్షకు, వెట్టిచాకిరికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈక్రమంలో తన ఆట పాటలతో ప్రజా కళాకారుడిగా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్నాళ్లు గద్దర్ తో కలిసి సంస్కృతిక పోరాటం చేశారు. కేవలం ఉద్యమ పాటలే కాకుండా.. ప్రకృతి, మానవ సంబంధాలపై సైతం ఆయన రాసిన పాటలు విస్తృత ప్రజాధారణ పొందాయి. ఆయన రాసిన ‘వానమ్మ.. వానమ్మా..’ పాట ప్రతీ ఒక్కరిని కదిలించింది. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2023లో ఆయనకు కాళోజీ నారాయణరావు అవార్డును అందించి సత్కరించింది.









