తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా.. రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది.
పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారంటూ నిన్నటివరకూ.. సోషల్ మీడియాల్లో వార్తలు వైరల్ కాగా.. వాటికి చెక్ పెడుతూ డైరెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహిపాల్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కూడా తిరిగి సొంత గూటికీ చేరుకున్నారు.
హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని తన నివాసంలో మహిపాల్ రెడ్డి, అనిల్ కుమార్కు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ పార్టీలోకి స్వాగతించారు. వీరితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్లో చేరటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.
గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంఖ్య పదికి చేరింది. మహిపాల్ రెడ్డి కంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. అయితే.. ఈ ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం గమనార్హం.