AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో లండన్ థేమ్స్ నదిలా మారనున్న మూసీ నది..!

రాష్ట్రంలో సర్కారు మారి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా ప్రకటించిన మొదటి ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ మరో అడుగు ముందుకు పడింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2026-27) లో మూసీ ప్రాజెక్టుకు సర్కారు వార్షిక బడ్జెట్ లో రూ. 1500 కోట్లను కేటాయించిన సంగతి తెల్సిందే. ఈ మొత్తం నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు దశలుగా చెల్లించేందుకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశగా రూ. 370 కోట్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా జీవో నెంబర్ 527ను విడుదల చేసింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన మరో ముఖ్యమైన అడుగు ముందుకు పడినట్టే. ఇప్పటి వరకు కాగితాలపైనే ఉన్న మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ పనులు కూడా విజిబిలిటీ స్థాయిలో జరగనున్నాయి.

 

గండిపేట నుంచి గౌరెల్లి వరకు..

వచ్చే మార్చి లోపు మరో మూడు దశలుగా, ఒక్కో దశలో రూ. 375 కోట్లతో కలిపి సర్కారు మొత్తం రూ. 1125 కోట్లు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగర నడిబొడ్డునుంచి ప్రవహించే మూసీ నది ఇక కాలుష్య కాసారంగా కాకుండా, ఆధునిక రివర్‌ ఫ్రంట్‌గా రూపాంతరం చెందనుంది. దీంతో గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహాక ప్రాంతం అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో వేగం పెరగనుంది. ఉపాధి, పర్యాటకం, రియల్ ఎస్టేట్‌కు ఊతమివ్వనుంది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటక పరంగానే కాకుండా పర్యావరణ హితంగా కూడా మరికొన్ని సరి కొత్త కార్యకలాపాలకు అవకాశముంది. నదీతీర ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలు, కమర్షియల్ జోన్లు, వినోద వేదికలు ఏర్పడితే వేలాది ఉద్యోగ అవకాశాలు సైతం లభించనున్నాయి. ముఖ్యంగా పాత బస్తీలోని మూసీకి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో వసతులు మెరుగుపడటంతో పాటు, రియల్ ఎస్టేట్ విలువలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 

ఎన్నో సవాళ్లు..వాటికి తగినట్టు వ్యూహాం

మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయిలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. కానీ గతంలో ఏ సర్కారు తీసుకుని చొరవను సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తీసుకుని, ఎలాంటి సవాళ్లు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు పక్కా వ్యూహాంతో పనులు చేపట్టేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. తొలి దశలో స్థల సేకరణపై సర్కారు ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. భారీ భూసేకరణ, పునరావాస సమస్యలు, పర్యావరణ అనుమతులు, నిధుల నిరంతర సమీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాల పునరావాసంపై ప్రభుత్వం సున్నితంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రాజెక్టును వ్యతిరేకించడం, బాధితులతో సమావేశాలు నిర్వహించడం తదితర అంశాలు ప్రాజెక్టు కు కొంత అడ్డంకులుగా మారే అ వకాశమున్నా, ఎలాగైనా పూర్తి చేయాలని సర్కారు సంకల్పంగా కన్పిస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టు పనులు మొదలైనట్టే అయి, మధ్యలోనే నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత గుణపాఠాలను పరిగణలోకి తీసుకుని సర్కారు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాన్ని సిద్దం చేసినట్లు తెలిసింది.

 

లండన్ థేమ్స్ నదీ తరహాలో అభివృద్ది

ప్రపంచ నగరాల్లో నదుల చుట్టూ అభివృద్ధి నమూనాలు నగర ముఖచిత్రాన్ని మార్చేశాయి. లండన్‌లో థేమ్స్, అహ్మదాబాద్‌లో సబర్మతి, సియోల్‌లో చెయాంగ్‌గ్యెచన్ తరహాలో హైదరాబాద్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ రూపుదిద్దుకుంటే నగరానికి ఎంతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చే అవకాశముంది. బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, భూసేకరణ ప్రారంభం వంటి పరిణామాలతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు కాగితాల నుంచి కార్యాచరణ దశలోకి అడుగుపెట్టింది. ఇది కేవలం మూసీ నది సుందరీకరణ, అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుని చేపట్టిన ప్రాజెక్టు కాదని, హైదరాబాద్ భవిష్యత్ నగర రూపకల్పనకు సంబంధించిన అతిపెద్ద అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టుగా మారనున్నట్లు ఇప్పటికే సర్కారు పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెల్సిందే.

ANN TOP 10