రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ‘స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలు’ అనే అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడం అత్యంత కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారులు, రూ.64 వేల కోట్ల విలువైన 624 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మరో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయని వెల్లడించారు.
ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వర్షాధార, మెట్ట, ఉద్యాన పంటలకు తగినట్లుగా నీటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా, స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.








