ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం.. అంబానీ ఇంట సంగీత్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తమ మనుమళ్లు, మనుమరాళ్లతో కనిపించారు. ముఖేశ్ అంబానీ కారును డ్రైవ్ చేస్తుండగా.. నీతా పక్క సీట్లో కూర్చున్నారు.
వెనక సీట్లో వారి మనుమళ్లు, మనుమరాళ్లు కూర్చుని ఉన్నారు. 1968లో విడుదలైన బ్రహ్మచారి చిత్రంలో ఉన్న ‘చక్కే మెన్ చక్కా పే గాడికి’ అనే పాటను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ ముందుకు సాగారు. అంబానీ దంపతులిద్దరూ పాట పడుతూ ముందుకు రాసాగారు.
మనవళ్లు, మనవరాళ్లను దగ్గరికి తీసుకుంటూ ముద్దు చేస్తున్నారు. నిజానికి ఇది అసలైన కారు కానప్పటకీ.. ముకేష్ అంబానీల విభిన్న ఆలోచన అందరినీ ఆకర్షించింది. కారులో ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా పిల్లలు పృథ్వీ, కృష్ణ, మనవరాళ్లు ఆదియా, వేద, ఆనంద్ పిరమల్ కవలలు కూడా ఉన్నారు. ఈ వీడియో సంగీత్ వేడుకకు హైలెట్గా నిలిచి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రత్యేక ఆకర్షణగా నృత్యాలు..
సంగీత్ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. షారుక్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగీ.. దీవాంగీ’ పాటకు ముకేశ్-నీతా, ఆకాశ్-శ్లోకా, అనంత్ అంబానీ-రాధిక మర్చంట్, ఈశా-ఆనంద్ పిరమాల్, డ్యాన్స్ చేశారు. నీతా అంబానీ భరతనాట్యంతో ఆకట్టుకున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా, అలియాభట్-రణ్బీర్ కపూర్ క్రీడాకారులు ధోనీ, హార్దిక్ పాండ్య తదితర హాజరయ్యారు. సల్మాన్తో కలిసి అనంత్ అంబానీ డ్యాన్స్ చేశారు. పాప్ స్టార్ జస్టిన్ బీబర్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. కాగా.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుక జులై 12 నుంచి14 వరకు ముంబయిలోని జియో సెంటర్లో జరగనుంది.









