నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్చగా ఉల్లంఘించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది.. ఎప్పుడు పరీక్షలు పెట్టారని.. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయని అడిగారు. కాంగ్రెస్ వచ్చాక 32వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి పెడితే ఆయన నియామక పత్రాలు ఇచ్చారని అన్నారు. ఇది రేవంత్ దివాలాకోరు రాజకీయానికి నిదర్శమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు నియామక పత్రాలు ఇవ్వలేదన్నారు.
*కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందని, నాలుగైదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు టాగ్ లైన్తో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగిందని, స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణకు తప్ప.. వేరే రాష్ట్రానికి ఉందా అని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమేనని, తాము గత పదేళ్ళలో రెండు లక్షల 32 వేల 308 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయంలో దేశంలో తెలంగాణ కంటే ముందు మరే రాష్ట్రం ఉందో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని, అది నిరూపిస్తే రేపు రాజీనామా చేస్తానని అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఒక మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంట్ పోతుంది అని ఎలా అంటాడన్నారు. కేఏ పాల్ జోకర్ కాదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే జోకర్ అంటూ కామెంట్స్ చేశారు. ఆస్పత్రిలో కరెంట్ పోతే జనరేటర్ కూడా అందుబాటులో ఉండదా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.