కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. టోర్నీ నుంచి చెలరేగి ఆడుతోన్న ఆ జట్టు మంగళవారం (మే 21) సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ క్వాలి ఫైయర్ మ్యాచ్ లో కోల్కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి (55) అర్ధశతకం చేయగా, క్లాసెన్ (32), కమిన్స్ (30) మినహా మరే బ్యాటర్లు రాణించకపోవడంతో ఎస్ ఆర్ హెచ్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోల్కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, చక్రవర్తి 2, అరోరా, రాణా, నరైన్, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్కతా కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించారు.









