AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిందే: మంత్రి తుమ్మల

విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి బోల్ గార్డ్ 11 ర‌కం ప్రత్తి విత్తన ప్యాకెట్ గరిష్ట ధరను రూ.864.00 గా నిర్ణయించిందని, ఏ ఒక్క డీలరైనా, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం హైద‌రాబాద్ స‌చివాల‌యంలో జ‌రిగిన వ్య‌వ‌సాయ శాఖ అధికారుల స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖరీఫ్ 2024లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షల ఎక‌రాల్లో ప్రత్తి సాగు కాగలదని వ్యవసాయశాఖ అంచనా వేశారు. దానికి సరిపడా పత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న పత్తి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ.. 2023లో 45.17లక్షలకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లో ప్రత్తికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశముందన్నారు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే బీజీ11 రకం విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోయాయని, ఈసారి 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు దఫాలు సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదే విధంగా రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యను ఈ ప్రభుత్వం సహించబోదని, విధుల పట్ల అలసత్వం వహించినా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకొని, ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

ANN TOP 10