ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 6.23 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. విద్యా సంవత్సరం ముగియకముందే ఫలితాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేపర్లను దిద్దే ప్రక్రియ ఈసారి రికార్డు స్థాయిలో వేగంగా చేశామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇక పదో తరగతి ఫలితాల్లో 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 84 శాతం కాగా.. బాలికల ఉత్తీర్ణత 89 శాతం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతం మంది ఉత్తీర్ణులయి ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించారు.









