ఐపీఎల్ 2024లో వరస ఓటములతో నీరసపడిన ముంబై ఇండియన్స్ జట్టుకు గుడ్ న్యూస్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ బ్యాడ్టైమ్ నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు.. ఆడిన మూడింటిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమవుతోందని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాటికి తోడు హార్దిక్ పాండ్య పేలవమైన కెప్టెన్సీపై విమర్శలు రోజురోజుకు పెరుగుతోన్నాయి. ఇక వరుస ఓటములతో డీలా పడిన ఆ జట్టుకు ఊరట లభించనుంది. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్, హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. మోకాలి గాయంతో మూడు నెలల పాటు క్రికెట్కు దూరమయ్యాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ముందు ఎన్సీఏ అధికారులు నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ల్లో సూర్య విఫలమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా కోలుకున్నట్లు నేషనల్ క్రికెట్ అకాడెమీ ప్రకటించింది. క్రికెట్ ఆడటానికి అతడు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉన్నాడంటూ క్లియరెన్స్ ఇచ్చింది. గురువారం సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీమ్లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. టాలెంటెడ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కు టీ20 ఫార్మట్లో మంచి రికార్డులు ఉన్నాయి. ఈ ఫార్మెట్లో టీమిండియా తరఫున నాలుగు సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 139 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. స్కై వస్తే ముంబై ఇండియన్స్ విజయాలను మొదలు పెడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ చేరికతో ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్గా మారే అవకాశం ఉన్నట్లు సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.









