హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) దర్యాప్తులో అధికారులు వేగం పెంచారు. నిన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ ముగియడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. నేడు రాధా కిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. రాధా కిషన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబీలో ఓఎస్డీగా పని చేసిన వేణుగోపాల్ రావును నేడు విచారణకు రావాలంటూ దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణుగోపాల్ రావును దర్యాప్తు బృందం విచారిస్తోంది. వేణుగోపాలరావు పదవి నుంచి రిటైర్ కాగానే ఎస్ఐబీ ఓఎస్డీగా గత ప్రభుత్వం నియమించింది. నేడు వేణుగోపాల్ రావును విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీంలో వేణుగోపాలరావు కీలకంగా పనిచేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ఇప్పటికే డీసీపీ విజయ్ కుమార్ చేరుకున్నారు. ఈ రోజు మరికొంత మందిని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.
చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) .. తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థికమూలాలపై దాడి చేయడం(ఇల్లీగల్ ప్రాక్టీసెస్).. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంతపార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ఫోర్స్ వాహనాలను వినియోగించడం (కరప్ట్ ప్రాక్టీసెస్).. ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమానావకాశాలు లేకుండా చేయడం.. 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలివి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తూ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు. ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి. అధికారం చేజిక్కించుకోవడానికి. కానీ.. ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచినవారిలో ఇద్దరు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా.. ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.









