AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 4.07 కోట్లు విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించి వాటికి పరిష్కారం దిశగా సూచనలు ఇస్తారన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని సీఎం తెలిపారు.

ANN TOP 10