తెలంగాణ అసెంబ్లీలో బీసీ కుల గణన తీర్మానంను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో కుల జనగణన తీర్మానంపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల గణనపై అనుమానాలొద్దని, చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కుల గణన అని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. కుల గణనపై ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని, బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుందని అన్నారు. మాకు రాజకీయ దురుద్దేశాలు లేవు.. కులగణనపై అనుమానాలొద్దని రేవంత్ అసెంబ్లీలో చెప్పారు.
కుల గణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తీర్మానంపై ఏదైనా లీగల్ చిక్కులపై అంశాలు ప్రతిపక్షాలకు తెలిస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలని రేవంత్ కోరారు. కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది. కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారని, కడియంను తప్పుదోవ పట్టించే వాళ్లను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుందంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ తీర్మానంతో బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే మా ఉద్దేశం . బాధితలుగా ఉన్నవాళ్లను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన అని రేవంత్ చెప్పారు.









