హైదరాబాద్: ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి చివరి వారంలో కోడ్ మొదలవుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో ఆయన ఇంపీరియల్గార్డెన్లో గురువారం సమావేశం నిర్వహించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్లాల్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రోత్సాహం వల్లే హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణ(Telangana)లో ఫిబ్రవరి 20 నుంచి అయిదు యాత్రలు ప్రారంభమవుతున్నాయని, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలకాలని సూచించారు. మోహన్లాల్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో ప్రారంభమైన జైశ్రీరామ్ నినాదం అరబ్ దేశాలకు వెళ్లిందన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ శంకుస్థాపనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభసభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.









