లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణీ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు. మరోవైపు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్న పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సునీత మహేందర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాక పట్నం మహేందర్రెడ్డి, ఆయన సతీమణి సునీతారెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగానే పట్నం మహేందర్ రెడ్డి సతీమణీ సునీత రాజీనామా చేశారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు. అలాగే గులాబీ పార్టీ నుంచి మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేల తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.









