భారత ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi)కి అబుదాబీ (Abu Dhabi)లో భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ‘అహ్లాన్ మోదీ’ కల్చరల్ ఈవెంట్ ప్రారంభానికి ముందు అక్కడి ఎన్ఆర్ఐలతో ప్రధాని మమేకమయ్యారు. అబుదాబిలో భారత సంతతి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించిందని, స్వదేశంలోనే ఉన్నట్టు అనిపించిందని మోదీ ఓ ట్వీట్లో తన సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. యూఏఈ (UAE)లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా అబుదాబిలోని తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు.
మోదీ పర్యటన సందర్భంగా ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఆ వెంటనే ఉభయులు ద్వైపాక్షిక సమావేశం జరిపారు. మోదీ రాక సందర్భంగా అహ్లాన్ మోదీ కల్చరల్ ఈవెంట్ను అబుదాబిలోని జయెద్ స్పోర్ట్స్ సిటీలో భారీగా ఏర్పాటు చేశారు. 35,000 నుంచి 40,000 మంది ఇందులో పాల్గోనున్నారు. 2014లో మోదీ భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి.









