హైదరాబాద్ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఇదివరకే టీపీసీసీ తీర్మానం చేసి పంపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని స్వయంగా కోరడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం జార్ఖండ్లోని రాంచీకి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుంచి సాయంత్రం ఢిల్లీ చేరుకున్న రేవంత్.. సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే వారు ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీతో సమావేశమైనట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం.









