రేపటి నుంచి గ్రామ సభలు
నిస్సాహాయులకు సాయం అందించడమే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ప్రజాపాలన దరఖాస్తుల విడుదల
‘ప్రజాపాలన’ దరఖాస్తులు విడుదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన లోగోను ఆవిష్కరించారు. దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
నిస్సహాయులకు సాయం అందించడమే తమ లక్ష్యమని, ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని… ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకు వెళ్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఆరు గ్యారంటీల హామీ ఇచ్చామని, డిసెంబర్ 7వ తేదీన తమ ప్రభుత్వం ఏర్పాటయిందని… జనవరి 7వ తేదీ లోపు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామన్నారు. గురువారం నుంచి గ్రామ, వార్డు సభలు ఉంటాయన్నారు. ఈ సభల ద్వారా ఆరు గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడిరచారు. ఆరు గ్యారంటీలను అర్హులైన వారికి ఇస్తామన్నారు.
వచ్చే జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కోసం సభలు నిర్వహిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. పదేళ్లుగా ప్రభుత్వం… ప్రజలకు అందుబాటులో లేదని, ఇప్పుడు ప్రభుత్వం.. అధికారులు ప్రజలకు చేరువై సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మారుమూల పల్లెలకు కూడా సంక్షేమ పథకాలు అందాలన్నారు. అర్హులు ఎవరూ కూడా ఎవరి కోసం ఎదురు చూడవద్దని… ఎవరి వద్దకు వెళ్లవద్దని.. ప్రభుత్వమే వారి వద్దకు వస్తుందన్నారు.
ప్రజాపాలనకు సంబంధించి ప్రతి మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తామని, ఓ గ్రూప్కు ఎండీవో, మరో గ్రూప్కు ఎంఆర్వో బాధ్యత వహిస్తారన్నారు. అయితే ఈ పది రోజులు కేవలం స్పెషల్ డ్రైవ్ మాత్రమేనని.. తర్వాత కూడా అర్హులకు పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.









