నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యనే ప్రధాన అజెండాగా తీసుకున్నాయి. గత నెల రోజులుగా ప్రతిపక్షాలు సైతం ఇదే అంశంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. నేడు జరగనున్న పోలింగ్లోనూ నిరుద్యోగమే ప్రభావితం చేయనుంది. ఇప్పుడు యువతను ఆకట్టుకునే పనిలో ఎవరు ఛాంపి యన్ అవుతారనేది కీలకం? దాదాపు 80 వేల ఉద్యో గాలను భర్తీ చేస్తామని ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వరుస నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ, పోలీసు నియామక మండలి విడుదల చేశాయి. ఈ క్రమంలో రెండు నెలల కిందట వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నియామకాల ప్రక్రియను కీలక మలుపు తిప్పింది. దీని తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల అంశం మీద ప్రభుత్వంపై గళమెత్తడం ప్రారంభించాయి.
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే మొదటి ఏడాది లోనే రెండు లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబరు17లోపు నియామకాలు పూర్తి చేసి, సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం ఉద్యో గాలు ఇలా వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది. అయితే నిరుద్యోగుల డిక్లరేషన్ వెనుక ఓట్లు ఒక్కటే కాదు, నిరుద్యోగుల సమస్యలను ఎత్తి చూపాలనే అజెండా ఉంది. తెలంగాణ ఏర్పాటు వెనుక మూడు ఉద్దేశాలున్నాయనుకుంటే నిధులన్నీ నీళ్ల కోసమే ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ నియామకాలను పట్టించుకోలేదు. దీని వల్ల నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్న మాట వాస్తవం. వారికి భరోసా కల్పించడం కోసమే అంటూ తీసుకొచ్చిన యూత్ డిక్లరేషన్ తో అన్ని పార్టీలు నిరుద్యోగులను ప్రసన్నం చేసు కునేందుకు ప్రయత్నిస్తుండటం రాజకీయంగానే వేడి రాజేస్తోంది.
టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్, ఎఈ, డిఎఓ పరీక్షలను రద్దు చేయగా మరికొన్ని పరీక్షలను ప్రభుత్వం వాయి దా వేసింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరూ అప్పట్లో భాగస్వాములైంది నియామకాల కోసమే. ఏండ్ల తర్వాత జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినా లీకేజీ వ్యవహారంతో నియామకాలు సరిగా జరగలేదు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగికి రూ.3016 నిరుద్యోగ భతి ఇస్తామని ప్రకటించి అదీ అమలు చేయలేదు. తల్లిదండ్రులు అప్పులు తెచ్చి పిల్లలను కోచింగ్లకు పంపిస్తున్నారు. నిరుడు ప్రకటించిన ఉద్యోగ నియామక ప్రకటనల్లో దాదాపు 17వేల ఉద్యోగాలు పోలీసుశాఖవే ఉన్నాయి. నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ బీఆర్ఎస్ వీరిని పూర్తిగా విస్మరించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రధాన పార్టీలకు నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా మారింది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. వారు ఎటువైపు మొగ్గుచూపుతారో వారినే విజయం వరించే అవకాశముంది.









