దక్షిణ కొరియా నుంచి భారీ పెట్టుబడులు ఏపీకి రప్పించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మంత్రి లోకేష్. ఆ దేశానికి చెందిన హ్యుందాయ్ మోబిస్ రప్పించేందుకు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీకి వస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పారు మంత్రి.
సౌత్ కొరియాలో బిజీగా మంత్రి లోకేష్: దక్షిణ కొరియా టూర్లో భాగంగా ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలతో బిజీగా ఉన్నారు మంత్రి లోకేష్. మూడో రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆ దేశానికి చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్-కాంపొనెంట్స్-ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బిన్ కిమ్తో రాజధాని సియోల్లో సమావేశమయ్యారు.
Advertisement
భారత్లోని ఆంధ్రప్రదేశ్ ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈవీ సెమీ కండక్టర్స్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేశ్. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఈవీ కాంపోనెంట్స్- బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం గురించి వారికి వివరించారు. విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ-ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.
హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ మద్దతు: విశాఖ నగరంలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అంతేకాదు ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రతిపాదించారు. ఆటోమొబైల్ హబ్గా మార్చడానికి, టైర్-1 సరఫరాదారుల భేటీ నిర్వహించేందుకు ఏపీతో భాగస్వామ్యం వహించాలని కోరారు. హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పకనే చెప్పారు.
Advertisement
సెమీ కండక్టర్స్, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్-OSAT రంగంలో పేరు పొందిన అపాక్ట్-APACT కంపెనీ సీఈవో సియాంగ్తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్తో ఏపీ ప్రభుత్వం దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు.
భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న హనా మైక్రాన్- Hana Micronతోపాటు OSAT సంస్థలు ఏపీ వైపు చూసేలా APACTని కోరారు. సెమీ కండక్టర్ కార్యకలాపాలకు సంబంధించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం APSSDCతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని OSAT కు మంత్రి లోకేశ్ ప్రతిపాదన చేశారు. దేశంలో అపాక్ట్ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
ASIP-APACT వైజాగ్ OSAT జాయింట్ వెంచర్ ఏపీకి లభించిన ఒక ప్రతిష్టాత్మక సెమీ కండక్టర్ విజయమని అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీ వర్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఈ సందర్భంగా లీ వెల్లడించారు. ఆ తర్వాత ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్-ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమ్ అధునాతన కార్యకలాపాలను నమూనాగా తీసుకుని ఏపీలోని మూలపేట ప్రాంతంలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా వారికి వివరించారు మంత్రి లోకేష్.








