మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమా కోసం యాక్షన్ మోడ్లోకి ప్రవేశించారు. దర్శకుడు బాబీ కొల్లితో ఆయన చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఓ భారీ యాక్షన్ ఘట్టం చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న రెండో షెడ్యూల్లో భాగంగా ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ సారథ్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులకు వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
‘మెగా158’ (వర్కింగ్ టైటిల్) రెండో షెడ్యూల్ జూన్ 22న హైదరాబాద్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ గతంలోనే ప్రకటన విడుదల చేసింది. “పొల్లాచ్చి అందాల నుంచి మరో భారీ ఘట్టంలోకి అడుగుపెట్టాం. మెగాస్టార్ ప్రతి షాట్ను ఓ ఉత్సవంగా మారుస్తున్నారు” అని పేర్కొంది. అంతకుముందు తమిళనాడులోని పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యువనటి అనస్వరా రాజన్ను చిత్ర బృందంలోకి అధికారికంగా స్వాగతించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. కొల్లా అవినాశ్ ఆర్ట్ డైరెక్టర్గా, ఆంటోనీ రూబెన్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత ఏడాది చిరంజీవి పుట్టినరోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పాత్ర కోసం చిరంజీవి జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోను పంచుకుని అభిమానులను ఉత్సాహపరిచారు. ‘ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్మార్క్’ అనే ట్యాగ్లైన్తో విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.








