కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరు నమోదుకు సంబంధించి నెలకొన్న వివాదంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పేరుకు అనుమతినిచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ముందుగా ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని కవితకు సూచించింది. ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ పార్టీ పాత పేరు ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని పోలి ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం వస్తుండటంతో, దీనిపై జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పేరు ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని పేర్కొన్న ఈసీ, 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితను ఆదేశించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలనే కవిత కోర్టులో సవాలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత, ఈ ఏడాది ఆరంభంలో సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఏప్రిల్లో ఈసీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే, ఈ పేరులోని ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త రూపం పాత పార్టీని గుర్తుచేస్తోందంటూ 1,100కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం కవితకు నోటీసులు జారీ చేసింది.








