AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలాలో కొట్టుకుపోయిన మహిళ..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మెట్టుగూడలో విషాదం నింపింది. జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ నాలాలో కొట్టుకుపోయి దుర్మరణం పాలైంది. వరద నీటిని దాటుకుంటూ వెళ్లే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయింది. అందరూ చూస్తుండగానే నాలాలో కొట్టుకుపోయింది. 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహంగా తేలింది. గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్రతో భాగ్యనగరమంతా సందడి నెలకొని ఉండగా.. మెట్టుగూడలోని దూద్‌బావికి చెందిన ఆ మహిళ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మెట్టుగూడలోని దూద్‌బావిలో నివాసం ఉండే బాధితురాలు.. గురువారం (సెప్టెంబర్ 28) ఉదయం పనినిమిత్తం బయటకు వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదానికి గురైంది. అప్పటికే భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అలాంటి సమయంలో ఆమె బ్రిడ్జి కిందుగా వరద నీటిని దాటే ప్రయత్నం చేసింది. స్థానికులు గమనించి వారించారు. అలా వెళ్లొద్దని సూచించారు. కానీ, ఆమె వారి మాటలను వినిపించుకోకుండా ముందుకు సాగింది. నాలాలో పడిపోయి కొట్టుకుపోయింది.

మహిళ నాలాలో పడిపోయిన విషయం గమనించి, కొంత మంది స్థానికులు ఆమెను కాపాడేందుకు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. కానీ, పడిన చోట ఆమె కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌‌తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ మహిళ కోసం గాలించారు.

వారాసిగూడలోని అంబర్ నగర్ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. బాధితురాలి ముఖంపై బలమైన దెబ్బలు ఉన్నాయి. నాలాలో పడిపోయినప్పుడు బలంగా దేనికైనా గుద్దుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ANN TOP 10