టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు నోచుకోలేదు. దానిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి (ఎస్వీఎన్ భట్టి) విముఖత చూపారు. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విషయంపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. తన సహచర న్యాయమూర్తికి ఈ కేసు విచారణపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.
దీంతో వచ్చే వారమే విచారణ జరుగుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీజేఐ వద్ద మెన్షన్ చేసేందుకు కొంత సమయం కోరారు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా. గురువారం నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి.
సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా క్వాష్ పిటిషన్ పై విచారణ అంశాన్ని సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కాగా, క్వాష్ పిటిషన్ పై విచారణ సమయంలో చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, బి.ఆదినారాయణ, ప్రమోద్ కుమార్ దూబే, తదితరులు వాదనలు వినిపిస్తారు.









