రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ, ఈసీపై 545 కోట్ల రూపాయలతో.. 14 వంతెనలపై నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఫతుల్లగూడా – పీర్జాదీగూడ వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సహా పలువురు నేతలు, పార్టీ శ్రేణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహా నగరానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి నదిగా మూసీ నది ఉండేదని వ్యాఖ్యానించారు. కానీ గత ప్రభుత్వాలు ఈ నదిని పట్టించుకోకపోవడంతో చివరికి మూసీ నది మురికి కూపంగా మారిపోయిందని తెలిపారు. ప్రస్తుతం మూసీ నది సుందరీకరణ పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే అక్టోబర్ చివరి నాటికి నీటి శుద్దీకరణ పనులు పూర్తవుతాయని తెలిపారు.
ఈ సందర్భంగానే మూసీ, ఈసీపై ఇప్పుడు 545 కోట్లతో 14 వంతెనలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని పేర్కొన్నారు. నిధులు పెరిగినా పర్వాలేదు కానీ హైదరాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలని అన్నారు. అంతేకాదు శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా ఈ 14 వంతెనల నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. 2000 మిలియన్ లీటర్స్ ఫర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. అలాగే దుర్గం చెరువు వద్ద 7 ఎంఎల్డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించినట్లు పేర్కొన్నారు. అయితే ఎస్టీపీలు పూర్తయితే మూసీ నదిలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్థితి ఉంటుందని చెప్పారు. అలాగే మంచిరేవుల – ఘట్కేసర్ వరకు మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.









