యాదాద్రి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా వెయ్యేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలనాటి వైభవం చెక్కుచెదరకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మించారు. ఇప్పటివరకు ఏ ఆలయంలోనూ లేని విధంగా పూర్తిగా నల్లరాతి కృష్ణ శిలలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదాద్రి ఆలయం కావడం విశేషం. యాదాద్రి కొండపైన ప్రతి కట్టడాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నించారు.
ప్రధానాలయం, ప్రాకారాల నిర్మాణాలు పూర్తికాగా.. మరికొన్ని కట్టడాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. కొండపైన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన హరిత హోటల్ నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధుల కింద రూ.7.70 కోట్లు మంజూరు చేసి, టెండర్లను ఆహ్వానించారు.
త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత భవనంలో 32 గదులు, 2 సూట్లు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన వీటిని ఆధునీకరించనున్నట్లు తెలిపారు. భవనం చుట్టూ గార్డెనింగ్, పార్కింగ్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. గదులతోపాటు ఆ పక్కనే అల్పాహారం, భోజనం చేసేందుకు అందుబాటులో ఉన్న హోటల్ ప్రాంగణాన్ని కూడా ఆలయ థీమ్ అనుగుణంగా మార్చనున్నారు. ఈ హరిత హోటల్ అందుబాటులోకి వస్తే భక్తులకు సౌకర్యవతంగా ఉండనుంది.