పాకిస్థాన్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా దూసుకెళుతున్న ఓ బస్సు ముందు వెళుతున్న వ్యాన్ ను ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యాన్ లో ఉన్న డీజిల్ డ్రమ్ములు పగిలి డీజిల్ నేలపాలైంది. ఆపై మంటలు ఎగిసిపడి బస్సు, వ్యానును చుట్టుముట్టాయి. మంటల్లో చిక్కుకుని బస్సులోని ప్రయాణికులు, వ్యాన్ డ్రైవర్ సహా పద్దెనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగానే ఉందని, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
కరాచీ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు శనివారం రాత్రి ఇస్లామాబాద్ కు బయలుదేరిందని పోలీసులు తెలిపారు. పిండి భట్టియాన్ సమీపంలో ముందు వెళుతున్న వ్యాన్ ను ఢీ కొట్టిందని చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. దీంతో మంటలు ఎగిసిపడగా చాలామంది ప్రయాణికులు చనిపోయారని, కొంతమంది కిటీకీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ప్రయాణికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా చనిపోయారని డిస్ట్రిక్ పోలీస్ ఆఫీసర్ (డీపీఓ) ఫహద్ వివరించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.









