రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు శనివారం అమెరికా పర్యటనకు వెళ్లారు. సుమారు వారం రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ పలు పెట్టుబడి సమావేశాలలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను, బ్యాక్గ్రౌండ్ వర్క్ను ఇప్పటికే పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులు ఖరారు చేశారు. ఇందులో భాగంగా న్యూయార్క్, చికాగో వంటి పలు నగరాల్లో మంత్రి కెటిఆర్ వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీలతో సమావేశం అవుతారు.
మంత్రి కేటీఆర్తో పాటు ఐటి,పరిశ్రమల శాఖకు సంబంధించిన పలు విభాగాల డైరెక్టర్లు అమెరికా పర్యటనలో భాగస్వాములయ్యారు. మంత్రి కేటీఆర్ ఒకవైపు తన పర్యటన తొలి అంకంలో విస్తృతంగా పెట్టుబడి సమావేశాలకు హాజరు కావడంతో పాటు తన పర్యటన చివరి అంకంలో తన కుమారుడు హిమాన్షు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరు అవుతారు. ఇప్పటికే హిమాన్షుకు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు అయ్యిది. ఇందుకు సంబంధించిన కోర్సు జాయినింగ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కుటుంబం హాజరు కానున్నది.









