వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు అధ్యక్షురాలు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను గజ్వేల్ వెళ్లనీయకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయడానికి నిరసనగా.. ఇంటి ముందే నిరాహార దీక్షకు దిగారు. అంతకు ముందు ఆమె పోలీసులకు హారతి ఇచ్చారు. ఆమె నివాసం లోటస్ పాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీని వెనుక ఆసక్తికర కారణం ఉంది. వైఎస్ షర్మిల ఇవాళ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో పర్యటించాలని అనుకున్నారు. దళిత బంధులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామ ప్రజలు ఇటీవల ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన షర్మిల.. ఆ ఊరికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడాలని భావించారు.
కానీ షర్మిల పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. షర్మిల హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళ్లకుండా చూడటం కోసం లోటస్ పాండ్లోని నివాసం వద్ద ఆమెను గృహ నిర్బంధం చేశారు. లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గజ్వేల్ బయల్దేరేందుకు ప్రయ్నతించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారికి హారతి ఇచ్చారు.
తాను గజ్వేల్ వెళ్తానని.. స్థానికులతో మాట్లాడతానని ఈ సందర్భంగా ఆమె పోలీసులకు తెలిపారు. తన పర్యటనను శాంతియుతంగానే చేపడతానని ఆమె చెప్పారు. తనను ఆపడం సరికాదని ఆమె పోలీసులకు హితవు పలికారు. మీ ఊరు వస్తానని గజ్వేల్ వాసులకు తాను హామీ ఇచ్చానని షర్మిల తెలిపారు. పోలీసుల అరాచకానికి, కేసీఆర్ నియంత పాలనకు నిరసనగా.. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా సాయంత్రం వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేపడతానని షర్మిల ఈ సందర్భంగా ప్రకటించారు.









