ఎమ్మెల్యే భార్యతో పాటు 20 మంది పిల్లలకు గాయాలు
నర్సంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట పట్టణ శివారులోని కమలాపురం జంక్షన్ వద్ద వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సును నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న ప్రయాణిస్తోన్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది విద్యార్థులతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే సతీమణికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సంపేటలోని ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన బస్సు.. సాయంత్రం సమయంలో విద్యార్థులను తీసుకెళ్తున్న క్రమంలో.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, మరో 15 మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే భార్య స్వప్నకు కూడా తీవ్ర గాయాలుకావడంతో ఆమె స్పృహకోల్పోయారు. చికిత్స కోసం ఆమెను హుటాహుటిన హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నర్సంపేట ఏసీపీ తిరుమల్, నర్సంపేట్ రూరల్ సీఐలు రవికుమార్, కిషన్ ఘటన స్థలానికి చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
అయితే.. ఈ ప్రమాదంలో గాయపడిన పెద్ద స్వప్నతో పాటు విద్యార్థులు అందరూ క్షేమంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. వరంగల్ అజరా హాస్పిటల్లో విద్యార్థులకు చికిత్స నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందరూ క్షేమంగానే ఉన్నారని… ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు.









