ఆగస్టు 15ను పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 20 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించిన అధికారులు.. ప్రయాణికులు, సందర్శకులకు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 20 వరకు విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికీ ఎంట్రీ లేదని ప్రకటించారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్టులోని పార్కింగ్, డిపార్చర్, అరైవెల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. అయితే.. విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు వీడ్కోలు తెలపడానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ మధ్య రద్దీ బాగా పెరిగిందని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రతీరోజు సుమారు 5 వేల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. స్టూడెంట్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ ఈ నెలలోనే వెళ్తున్నారని వెల్లడించారు. వాళ్లకు సెండ్ఆఫ్ ఇచ్చేందుకు చాలామంది వస్తుండడంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఒక్కో స్టూడెంట్కు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి 30 నుంచి 50 మంది వస్తున్నారని చెప్పుకొచ్చారు.









