సిద్దిపేట జిల్లా అక్కెనపల్లి వాగులో గల్లంతైన కారు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శుక్రవారం రాత్రి సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత వాగు వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. సిద్దిపేట, హుస్నాబాద్ పోలీసులు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకి అభించలేదు. మళ్లీ శనివారం ఉదయం సిద్దిపేట, హుస్నాబాద్ ఏసీపీలు సురేందర్రెడ్డి, సతీష్కుమార్ సీఐలు, ఎస్ఐలు, పోలీసులు వాగు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు కొనసాగించారు. డ్రోన్ కెమెరాలు, గజ ఈతగాళ్లతో జల్లెడ పట్టినా కారు ఆచూకి లభించలేదు. ఈ మార్గంలో సీసీ కెమెరాలు ఎక్కడా లేకపోవడంతో కారుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. వాగు ప్రవాహం క్రమంగా తగ్గుతుండడంతో రాత్రి వరకు వేచి చూస్తామని పోలీసులు తెలిపారు.
పుకార్లేనా?
వాగులో కారు కొట్టుకపోయి ఒక రోజు గడిచినా అచూకి లభించకపోవడంతో కారు అందులో పడిందా? లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా తోపాటు ఇతర జిల్లా పోలీస్ స్టేషన్లో ఎక్కడా కారు ఆచూకీ లభించడంలేదని, వ్యక్తి కనబడటం లేదన్న ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవ్వరూ లేకపోవడంతో పుకార్లుగా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.









