ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనబోతోంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన ఈ తీర్మానానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా బుధవారం ఆమోదం తెలిపారు. దీనిపై చర్చకు తేదీని త్వరలోనే ఖరారు చేయబోతున్నారు. 26 పార్టీల కూటమి ఇండియా (I.N.D.I.A)లో లేని పార్టీ బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. అటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధాని మోడీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.









