గొంతులో పునుగు(చిన్నబజ్జి) ఇరుక్కొని ఊపిరాడక 13 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మారుతి, కవిత దంపతులు రెండేళ్ల నుంచి ముస్తాబాద్లో ఉంటున్నారు. వీరికి క్రాంతి కుమార్(13 నెలలు) అనే కొడుకు ఉన్నాడు.
సోమవారం సాయంత్రం ఇంట్లో పునుగులు చేశారు. ఒక పునుగును బాలుడికి ఇవ్వగా, నోట్లో పెట్టుకుని మింగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అది గొంతులో ఇరుక్కుపోయి, ఊపిరాడక బాలుడు స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, గతంలో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోవడంతో అక్కడ కలిసి రావడం లేదని ఇక్కడి వచ్చామని, కానీ ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఎదురైందని బాలుడి తల్లిదండ్రులు విలపించడం చూపరులను కలిచివేసింది.









