తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. అసంతృప్తి నేతలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తప్పులు చూపడం బంద్ చేయాలని సూచించారు. కిషన్ రెడ్డిని (Kishan Reddy) స్వేచ్ఛగా పని చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన ముహూర్తంలో జూలై 21న ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బిజేపీ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపి అరవింద్,మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు హాజరయ్యారు.









