AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్.. నేతలంతా ఏకతాటిపైకి

ఉచిత విద్య, రూ.500లకే గ్యాస్.. తెలంగాణ కాంగ్రెస్ వరాలు, ఏకతాటిపైకి వచ్చిన నేతలు
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500లకే పేదలకు వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కేజీ టు పీజీ ఉచిత, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల చొప్పున భృతి సహా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టనున్నట్లు చెప్పిన 10 హామీలను ప్రకటించారు.

భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కి.మీ. పూర్తయిన సందర్భంగా గురువారం (మే 25) జడ్చర్లలో రాజీవ్‌ గాంధీ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. కర్ణాటక ఎన్నికల ప్రభావమో, స్వతహాగా మేల్కొలుపో తెలియదు గానీ.. కాంగ్రెస్ నేతలందరూ విభేదాలను పక్కనబెట్టి ఈ సభా వేదికగా ఏకతాటిపైకి వచ్చారు. కేడర్‌కు సానుకూల సంకేతాలను అందించగలిగారు. జిల్లాల వారీగా గెలిపించుకోవాల్సిన స్థానాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం పెంచారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పాటలతో హుషారెత్తించారు.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ సీనియర్ నేతలందరూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని తెలిపిన భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్‌ గుంజుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి తెలిపారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని.. తాము అధికారంలో రాగానే రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

ANN TOP 10