మంచి మనసు చాటుకున్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాల్లోనే కాదు ఎదుటివారికి సాయపడటంలోనూ ముందుటారనే టాక్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది. సాయం చేయమని ఆయన గుమ్మం తట్టిన వారిని ఆదుకోవటంలో ఏ మాత్రం వెనకడుగు వేయరని పేరుంది. తాజాగా.. ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
రెండ్రోజుల క్రితం కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన నరేశ్ కుమారుడు హాత్విక్ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. చిన్నారి గురించి ఆలోచన వద్దని తన సొంత కుమారుడిలా చూసుకుంటానని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ ద్వారా నరేశ్ కుమారుడు హాత్విక్ పేరిట రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. క్యాన్సర్తో బాధపడుతున్న నరేశ్ తల్లికి ఖర్చుల నిమిత్తం మరో రూ. 25 వేలు పంపించారు. నరేశ్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారికి ధైర్యం చెప్పారు.
“హైదరాబాద్ కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం కావటం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఢిల్లీలో ఉన్న కారణంగా నరేశ్ తండ్రితో ఫోన్లో మాట్లాడాను. కన్న కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయనకు.. ఇకపై హాత్విక్లో నరేశ్ను చూసుకోమని ధైర్యం చెప్పాను. బాలుడి గురించి ఆలోచించవద్దని నా సొంత కుమారుడిలా చూసుకుంటానని చెప్పాను. బాలుడి మేనత్తలు హైదరాబాద్లో ఉంటారని తెలిసింది. అక్కడే దగ్గరలో హాస్టల్లో ఉంచి చదివిస్తాను. టాప్ స్కూల్లో చదివించే బాధ్యత నాది. చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని వారితో చెప్పాను.” అని కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.









