AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్‌లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ‌న్నీ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 18 మంది కోర్టు ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు.

 

2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు, విచారణ అనంతరం మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

 

ఈ ఛార్జ్‌షీట్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా పేర్కొన్న పోలీసులు, అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. ఈ క్రమంలోనే 19 మంది నిందితులకు కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈరోజు విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులందరూ హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది.

ANN TOP 10