భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక ముందడుగు పడింది. భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మొత్తం 428.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) విలువైన ఈ ప్యాకేజీలు భారత ఆర్టిలరీ, వైమానిక దళాల నిర్వహణ సామర్థ్యాలను పెంచనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.
అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్సీఏ) ఈ ప్రతిపాదనలను అక్కడి కాంగ్రెస్కు పంపించింది. ఇందులో కొత్త ఆయుధాల కొనుగోలు ప్రస్తావన లేదు. ఇప్పటికే భారత సైన్యంలో ఉన్న ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్లు, ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్ల నిర్వహణ, విడిభాగాలు, సాంకేతిక సాయం, శిక్షణ వంటి అంశాలను మాత్రమే చేర్చారు.
అత్యధికంగా 230 మిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీ ఎం777ఏ2 హోవిట్జర్ల కోసం కేటాయించారు. ఇందులో విడిభాగాలు, మరమ్మతులు, సాంకేతిక సేవలు, శిక్షణ, ఫీల్డ్ సపోర్ట్, లాజిస్టిక్స్ సేవలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా మోహరించగల ఈ హోవిట్జర్లు భారత సైన్యానికి ఇప్పటికే కీలక ఆయుధాలుగా మారాయి. వాటి పనితీరును మరింత మెరుగుపరచడమే ఈ ప్యాకేజీ ప్రధాన లక్ష్యం.
మరో 198.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అపాచీ దాడి హెలికాప్టర్ల కోసం మంజూరైంది. ఇందులో ఇంజినీరింగ్ సేవలు, సాంకేతిక మద్దతు, శిక్షణ, లాజిస్టిక్స్ సాయం, అవసరమైన సాంకేతిక డేటా అందించనున్నారు. యుద్ధ పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించే అపాచీ హెలికాప్టర్ల సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడంలో ఈ మద్దతు ఉపయోగపడనుంది.
ఈ ఒప్పందాలపై అమెరికా రక్షణ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక అభివృద్ధికి భారత్ ప్రధాన శక్తిగా నిలుస్తోందని పేర్కొంది. ప్రస్తుత, భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్కు ఈ మద్దతు ఉపయోగపడుతుందని వెల్లడించింది. ప్రాంతీయ ముప్పులను నిరోధించే సామర్థ్యం కూడా మరింత పెరుగుతుందని తెలిపింది.
గత రెండు దశాబ్దాల్లో భారత్-అమెరికా రక్షణ సంబంధాలు వేగంగా విస్తరించాయి. 2008లో దాదాపు శూన్యంగా ఉన్న ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లకు చేరింది. సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సహకారం కూడా గణనీయంగా పెరిగాయి. తాజా ఆమోదం రెండు దేశాల మధ్య పెరుగుతున్న విశ్వాసానికి మరో నిదర్శనంగా భావిస్తున్నారు.








