AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భానుడి భగభగలు.. ఆ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతుండడంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావడానికి జనం హడలెత్తిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్‌, ఆదిలా బాద్‌, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నల్గొండ జిల్లా కట్టంగూరు, ఆసీఫాబాద్‌ జిల్లా జంబుగల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదివారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 41 డిగ్రీలకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌- మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

హైదరాబాద్‌ నగరంలోని ప్రాంతాల్లో సోమవారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌, సైదాబాద్‌, బండ్లగూడ, హిమాయత్‌ నగర్‌, ఎల్బీనగర్‌, నాంపల్లి, చార్మినార్‌, బాలాపూర్‌, యాకత్‌పుర, చాంద్రాయణగుట్ట, సరూర్‌నగర్‌, కోఠి తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల భారీ ఈదురు గాలులు వీచాయి. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఇళ్లలో నుంచి బయటికి రావడానికి జనం హడలెత్తిపోతున్నారు. ఎండవేడి, ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు సోమవారం కురిసిన వర్షంతో ఉపశమనం కలిగింది.

ANN TOP 10