కాక్రోచ్ జనతాపార్టీ మరో పోరాటానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఆ పార్టీ ప్రతినిధులు వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పర్యటనకు వెళ్లిన సీజేపీ ప్రతినిధులకు స్థానికుల నుంచి నిరసనలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత వారిపై దాడి చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?
రాజస్థాన్లో బగ్రూ నియోజకవర్గంలోని రాంపుర గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితులపై తెలుసుకునేందుకు కాక్రోచ్ జనతాపార్టీ టీమ్ పర్యటిస్తోంది. ఈ బృందానికి ఆ పార్టీ కో-కన్వీనర్ అశుతోష్ రాంగా నాయకత్వం వహిస్తున్నారు. దాదాపు అరడజను సభ్యుల గల టీమ్ పాఠశాలలో సదుపాయాలపై పరిశీలించేందుకు అక్కడకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో స్థానికులు వారిపై దాడి చేశారు. సభ్యులను పరుగులు పెట్టించారు కూడా. ఈ ఘటనతో సీజేపీ ప్రతినిధులు ఒక్కసారిగా షాకయ్యారు. అయినా సరే ప్రతినిధుల బృందం ఆ గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే పాఠశాల పరిస్థితులను తెలుసుకునేందుకు స్థానికులు ఏ మాత్రం అంగీకరించలేదు. ఈ క్రమంలో వారి మధ్య మాటల తీవ్రత క్రమంగా పెరగడంతో స్థానికులు దాడి చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అశుతోష్ టీమ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల చాలా ఏళ్లుగా పశువుల పాకలో నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దాన్ని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లామన్నారు. అక్కడ తమ టీమ్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు అశుతోష్ రాంగా. పాఠశాల సమస్యను పరిష్కరించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, కేవలం రాజకీయ కారణాలతో అడ్డుకోవడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లలు చదువుకోవడం ఆందోళనకరమని అన్నారు.
పాఠశాల గతంలో 5వ తరగతి వరకు ఉండేది. పాఠశాల కోసం గ్రామంలోని పెద్దలు భూమిని విరాళంగా ఇచ్చారని స్థానికుడు తెలిపాడు. 1999లో పాఠశాల భవనం నిర్మించారని, అప్పటినుంచి భవనానికి అవసరమైన స్థాయిలో పునరుద్ధరణ పనులు జరగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. పిల్లలు భవనంలో కూర్చుని చదువుకోవడానికి అనుకూలంగా లేకపోవడంతో పెద్ద భవనంలో రెండు గదులను ఏర్పాటు చేశారు గ్రామస్థులు. సుమారు 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలను పశువుల దొడ్లో నిర్వహిస్తున్నారని ఆరోపించారు సీజేపీ ప్రతినిధి అశుతోష్. తమను రాకుండా బీజేపీ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. జరిగిన ఘటనపై సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శుక్రవారం మండిపడ్డారు. రాజస్థాన్లో ఓ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్లపై బీజేపీ గూండాలు దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో సీజేపీ సభ్యులు గాయపడ్డారని వెల్లడించారు. ప్రతినిధులను ఈ విధంగా కొట్టడానికి రాజస్థాన్ పోలీసులు అనుమతించారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, అక్కడ రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు.








