AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలపై వైసీపీలో గుబులు..

ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఒంటరిగా వెళ్లాలని భావించిందా? జనసేన అధినేత నిర్ణయంతో ప్రత్యర్థుల షాక్ తగలనుందా? కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తే.. తమకు డోకా ఉండదని వైసీపీ ఇన్నాళ్లుగా ఆలోచన చేసింది. ఇప్పుడు ఎవరికివారు పోటీ చేస్తే.. వైసీపీ పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్తలు పదవుల కోసం వలసలు పోవడం ఖాయమనే వాదన అప్పుడే మొదలైంది.

గురువారం జనసేన పార్టీ ఆఫీసులో లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. సార్వత్రిక ఎన్నికల వ్యూహం వర్తించదని తేల్చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 21 సీట్లకు జనసేన పోటీ చేసింది. అది అప్పటికి మాత్రమేనని తేల్చిచెప్పేశారట. ప్రాంతాలవారీ రాజకీయ, సామాజిక పరిస్థితుల ఆధారంగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సంకేతాలు ఇచ్చారట అధినేత పవన్. ఈసారి జన సైనికులు, వీర మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జనసేన పోటీ ఉంటుందని, తగిన స్థానాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు సమాచారం.

స్థానిక ఎన్నికల విధివిధానాల రూపకల్పనకు 11 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు జనసేన అధినేత. అందులో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఉంటుంది. కమిటీ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? కలిసి వెళ్తే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? దానిపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతమే లక్ష్యంగా ఇప్పటి నుంచి అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్న చోట్ల పవన్‌కు పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు అంతర్గత సమాచారం. జనసేన కార్యకర్తల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని పవన్ తేల్చిచెప్పినట్టు సమాచారం. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని పవన్ చెప్పినట్టు సమాచారం. ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే.

రెండో వైపు వద్దాం..  జనసేన నిర్ణయంపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? కూటమి అధికారంలోకి వుందని, ఇప్పటికే వైసీపీ నుంచి చాలామంది నేతలు ఆ పార్టీ వైపు వెళ్లారు. పనిలో పనిగా వైసీపీ కార్యకర్తలు అటువైపు మొగ్గు చూపే అవకాశముందని అనుకుంటున్నారు. ఆ పార్టీ వైపు వెళ్తే తమకు పదవులు వస్తాయని,  వైసీపీ వైపు ఉంటే కష్టాలు తప్పవని ఆలోచన వ్యక్తం చేస్తున్నారట. మరో మూడేళ్లు చూసుకోవాల్సిన అవసరం లేదని దిగువ స్థాయి కార్యకర్తల మాట. అదే జరిగితే వైసీపీ నుంచి దిగువ స్థాయి, మండలస్థాయి కార్యకర్తలు, నేతలు.. జనసేనలోకి వలస వెళ్లే అవకాశముందన్న సంకేతాలు లేకపోలేదు.

క్దూటమి ఆలోచనను ముందుగా పసిగట్టిన జగన్.. నేతలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. మొత్తానికి స్థానిక సంస్థలు ఎన్నికలు అధికార పార్టీ ఏమోగానీ, అసలు టెన్షన్ వైసీపీకి పట్టుకుందని ఆ పార్టీ నేతలు గుసగుసలు పెట్టేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.

ANN TOP 10